తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించే దిశగా అడుగులేస్తాం : సోము వీర్రాజు
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తమ పట్టు సాధించాలని.. బలమైన నేతలను ఏరికోరి మరీ వారికి అధికారం అప్పగిస్తుంటుంది. యూపీలో యోగి, అస్సాంలో బిశ్వశర్మ సహా ఎంతో మంది నాయకత్వ పటిమ ఉన్న నేతలకు అధికారం అప్పగించేసి ప్రజలకు మెరుగైన పాలన అందించేసి గెలిచేలా చేస్తుంది. తెలంగాణలోనూ చాలా మంది బీజేపీ నేతలను అధ్యక్షులుగా చేసినా బీజేపీ ఆశించిన ప్రయోజనం దక్కించుకోలేకపోయింది. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బీజేపీకి దూకుడు వచ్చింది. అధికారం దిశగా సాగుతోంది. ఇప్పుడు ఏపీలోనూ ఆ దిశగా బలమైన నేత కోసం బీజేపీ అన్వేషిస్తోందని సమాచారం. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిపై బీజేపీ చూపు పడిందని సమాచారం.
రాజకీయాల నుంచి రిటైరైన చిరంజీవిని మోడీ సభకు పిలవడంతోనే అందరిలోనూ అనుమానాలు వచ్చిపడ్డాయి. కేంద్రంలో వైసీపీ సాయం తీసుకున్న బీజేపీకి రాష్ట్రంలో పవన్ కల్యాణ్ తీరు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగానే పవన్ రాజకీయం చేస్తున్నారు. జగన్ ను ఓడించడానికి.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి అవసరమైతే టీడీపీతోనూ కలిసి పోటీచేయడానికి సంకేతాలు పంపారు.ఇదే బీజేపీకి మింగుడుపడలేదు.ఇటీవల నడ్డా.. నేడు మోడీ టూర్లకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.. ఇక ఇప్పటంలో బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే ఏపీలో పర్యటనలకు వెళతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు బీజేపీతో సంబంధం లేకుండానే దసరా నుంచి నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఏకంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇదే ఊపులో జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా లేదా కలిసి వచ్చే పార్టీలతో ఎలాగైనా సరే జగన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. కానీ మోడీ మాత్రం ఈరోజు అల్లూరి జయంతిలో జగన్ ను పక్కనపెట్టుకొని మరీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ రూటు మార్చినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటనకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకుండా ఆయన అన్నయ్య చిరంజీవిని పిలవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ తో సెట్ కావడం లేదని అందుకే చిరంజీవిని బీజేపీ తరుఫున తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించి సీఎం క్యాండిడేట్ గా చిరు ను ప్రొజెక్ట్ చేయాలని ఆలోచిస్తోందట . బీజేపీ పాలిటిక్స్ కు చిరంజీవి చిక్కే అవకాశాలు మాత్రం లేవంటున్నారు. చిరంజీవిని సీఎం క్యాండిడేట్ గా తెరపైకి తెస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒప్పుకుంటారని మద్దతు ఇస్తారని బీజేపీ భావిస్తోంది.కానీ తమ్ముడు పవన్ ను పక్కనపెట్టి తను సీట్లో కూర్చోవాలని చిరంజీవి ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ల బంధం అత్యంత ధృడమైనది. ఒకవైపు సమస్యలపై స్పందిస్తూనే మరోవైపు కేంద్ర పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ఎలా చెప్పుకుంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంటోందని అంటున్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యనేతలతో వ్యూహరచన చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న పథకాలు కేంద్రానివేనని బీజేపీ వాదిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రభావం కనిపించ లేదు.
2024 ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ నిర్ణయించుకుందని అంటున్నారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బయట పెట్టి, కేంద్ర మంత్రులను, అగ్రనేతలను ఏపీకి తీసుకొచ్చి బలోపేతం కావాలని స్కెచ్ వేసిందట. పార్టీలో నేతలను, జనసేనలో కార్యకర్తలను కలుపుకొని ఏపీలో తామేంటో నిరూపించుకుని ప్రజాసమస్యలపై పోరాటాలు కొనసాగించాలని చూస్తోంది. తద్వారా ప్రజలకు చేరువ కావాలని వ్యూహరచన చేస్తోందని అంటున్నారు.మరోపక్క, బీజేపీ వేసిన స్కెచ్లపై భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా రాష్ట్రంలో అమలవుతున్నవి కేంద్ర పథకాలేనని ఎన్నికల్లో చెప్పుకొచ్చినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. ప్రస్తుతం అలా కాకుండా ఒక్కో శాఖ నుంచి ఆ శాఖ కేంద్ర మంత్రినే స్వయంగా ఏపీకి తెచ్చి వివరించేలా వ్యూహం రచించారట. అయితే మంత్రులను ప్రజల మధ్య తిప్పితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కొంతమంది బీజేపీ నేతలు వాదిస్తున్నారు.