ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్నిరోజులు, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. తొలిరోజు శాసనసభలో పరిపాలనా వికేంద్రీకరణపై చర్చించే అవకాశం ఉంది. పరిపాలనా వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేయనున్నట్లు సమాచారం.
ఈ రోజు సభలో మొదటగా దివంగత సభ్యులకు సంతాపాన్ని తెలియజేయనున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శత్రుచర్ల చంద్రశేఖరరాజు, పులవర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డిల మృతిపై సభలో సంతాప తీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం ప్రవేశపెడతారు. ఈసారి సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 3 బిల్లులు చట్ట సవరణకు, ఒక బిల్లు రద్దుకు సంబంధించినవి. ‘ఆటో మ్యుటేషన్’ విధానానికి అనుగుణంగా రికార్డ్స్ ఆఫ్ రైట్-1971 చట్టాన్ని సవరిస్తారు.
భూముల రీ-సర్వే అనంతరం యజమానులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన టైటిలింగ్ యాక్టు సవరణ తీసుకురాబోతున్నారు. ఈ బిల్లును మూడోసారి సభలో పెడుతున్నారు. దీనికి చట్టసభల్లో ఆమోదం తెలిపిన తర్వాత ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపనున్నారు. 1956 నాటి కౌలు చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు మూడు రాజధానుల అంశంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారని చెబుతున్నారు. దీనిపై ఆయన రాజకీయంగా కీలక ప్రకటననూ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.